Monday, September 28, 2015

అదిరేటి అందానికి....!

మొటిమలూ, మచ్చలూ, చర్మం ఎరుపు రంగులోకి మారడం, నిర్జీవంగా తయారవడం, నల్లగా అవడం వంటి ఎన్నో సమస్యలకు గంధం పరిష్కారం చూపుతుంది. ముఖానికి కొత్త నిగారింపూ అందిస్తుంది.
• ఎలాగో మీరే చూడండి..
• రెండు చెంచాల గంధం, చెంచా పసుపూ, మూడు చెంచాల తేనె కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖం, మెడకు రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే మొటిమల సమస్య ఉపశమనాన్నిస్తుంది.
• నారింజ తొక్కల పొడి ఓ చెంచా, రెండు చెంచాల గంధం పొడికి మూడు చెంచాల గులాబీ నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది.
• చెంచా చొప్పున గంధం, కలబంద గుజ్జు, కొబ్బరిపాలు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే దద్దుర్లూ, చర్మం కందిపోవడం వంటి సమస్యలు ఉండవు.
• చెంచాడు ముల్తానీ మట్టి, చెంచా గంధం, వీటికి సరిపడా గులాబీ నీళ్లు చేర్చి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పావు గంట తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. ఇది చక్కటి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. రక్తప్రసరణని మెరుగు పరుస్తుంది. ముఖంపై వలయాలు, మచ్చలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ని నిర్మూలిస్తుంది.
• కీరదోసా, బంగాళదుంపా, తేనె, పెరుగూ, గంధం.. ఇవన్నీ చెంచా చొప్పున కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత నీళ్లతో కడిగేస్తే మురికి తొలగిపోయి మచ్చల్లేని ముఖం మీ సొంతమవుతుంది.
• చెంచా చొప్పున సెనగపిండీ, గంధం.. వాటికి తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి. దాన్ని పూతలా వేసి పూర్తిగా ఆరాక కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.

No comments:

Post a Comment