Saturday, February 22, 2014

త్రిఫలచూర్ణంతో ఇన్‌ఫెక్షన్లకు చెక్

ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత పరిశోధనా ఫలితాల ప్రభావం వైద్యరంగంలో కూడా విప్లవాత్మక పరిణామాలకు దోహదపడటం వల్ల సగటు మానవుని ఆయుఃప్రమాణం గణనీయంగా పెరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ ఆరోగ్యప్రమాణాల స్థాయి మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం విచారించదగ్గ విషయం. ఆధునిక జీవన విధానాలు, వాతావరణ పర్యావరణ కాలుష్యం, నిద్రలేమి, అతినిద్ర, ధూమపానం, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, అనియమిత ఆహార సేవనం, అకాల భోజనం, శారీరక వ్యాయామం లేకపోవడం, వృత్తి,కుటుంబ, సామాజికపరమైన ఒత్తిళ్లు, వైద్య సలహా లేకుండా అవగాహన లేమితో కృత్రిమ ఔషధాలను విచ్చలవిడిగా, విచక్షణారహితంగా విరివిగా ఉపయోగించడం ఇత్యాది కారణాల వల్ల మన శరీరంలో ఉన్న వ్యాధినిరోధక శక్తి బలహీనపడుతోంది. తద్వారా వివిధరకాల బాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి క్రిములు దాడిచేసి అనేక కొత్త కొత్త సమస్యలను, రుగ్మతలను కలుగజేస్తున్నాయి. వీటితో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బుల్లాంటి వివిధ రకాల జీవనశైలి వ్యాధులు తిష్ట వేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడే దుష్పరిణామాలు లేని అందరికి అందుబాటులో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధ ఔషధ దినుసులను ఉపయోగించి సులువుగా తయారుచేసుకోగలిగే ఇంటిల్లిపాదికి సురక్షితంగా నిరపాయకరంగా ఉపయోగపడే ఔషధయోగం త్రిఫల చూర్ణం. పచారి కొట్లలో దొరికే కరక్కాయల బెరడు, ఉసిరికాయల బెరడులను పొడిచేసి సమానంగా కలిపితే తయారయ్యే దివ్యౌషధమే ఈ త్రిఫల చూర్ణం. ఈ విధంగా తయారైన ఔషధం ఆయుర్వేదౌషధ విక్రయశాలల్లో దొరుకుతుంది.
రోజూ రాత్రి పడుకునేటప్పుడు 5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని అరగ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి సేవిస్తుంటే మలబద్దక సమస్య తగ్గడమే కాక జీర్ణశక్తి మెరుగుపడి త్రేన్పుల, కడుపబ్బరం లాంటి అజీర్ణ లక్షణాలు తగ్గుతాయి. జననాంగాన్ని శుభ్రం చేసుకుంటే వైట్ డిశ్చార్జి తగ్గుతుంది. గోరువెచ్చగా చేసిన కషాయంలో అరగంట సేపు కూర్చుంటూ ఉంటే మూలవ్యాధి, ఫిషర్, భగందరం లాంటి ఇబ్బందులు తగ్గుతాయి.
దేహంలో అదనంగా పేరుకున్న కొవ్వు, తత్సంబంధ స్థూలకాయం తగ్గేందుకు రోజూ రెండుసార్లు రెండు మూడు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని తగినంత తేనె లేదా కప్పు పలుచటి మజ్జిగలో కలిపి తీసుకుంటున్నట్లయితే సత్ఫలితం కనిపిస్తుంది. త్రిఫల చూర్ణానికి 16 రెట్లు నీరు పోసి 8వ వంతు నీరు మిగిలేటట్లు మరిగించి, చల్లార్చి వడగట్టి మొండి పుండ్లు, గాయాలపై పట్టిస్తే అవి త్వరగా మానిపోతాయి. ఇదే కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిట పడుతుంటే తరచుగా వచ్చే నోటిపుళ్లు తగ్గుతాయి.
మధుమేహానికి...
ఆరోగ్యవంతులు సైతం తరచూ వ్యాధులకు గురికాకుండా కాపాడే ఈ త్రిఫల చూర్ణాన్ని నిత్యం సేవిస్తుంటే రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంటాయి. మధుమేహ వ్యాధి వల్ల నేత్రాలు, మూత్రపిండాలు, మెదడు, చర్మం తదితర అవయవాలు త్వరగా రుగ్మతలకు గురికాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
వ్యాధినిరోధక శక్తి పెరిగి మూత్రనాళ, జననేంద్రియ, ఫంగస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అంగస్తంభన, శీఘ్రస్ఖలన సమస్యలు పోతాయి. గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణాన్ని కలిపి పేస్టులా చేసి తల వెంట్రుకల కదుళ్లకు దట్టంగా పట్టించి గంట తరువాత శీకాయ లేదా కుంకుడు రసంతో తలస్నానం చేస్తే వెంట్రుకలకు బలం చేకూరుతుంది. జుత్తు రాలడం, చిట్లడం, తెల్లబడటం, చుండ్రు తగ్గుతాయి.
త్రిఫ్రల చూర్ణంలో తగినంత వంట సోడా కలిపి పిప్పిగోళ్లపై పట్టిస్తే క్రమంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. రోజూ దీంతో దంతధావనం చేస్తే దంత, చిగుళ్ల వ్యాధులు పోతాయి.

No comments:

Post a Comment